జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లి, జూలై-31(విజయక్రాంతి): జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ తో కలిసి మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన పట్టణ పరిపాలన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జల శక్తి జన భాగిదారి కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఇకపై కొత్తగా నిర్మించే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత (సోక్పిట్) తప్పనిసరిగా ఉండాలని, ఇంకుడు గుంత లేని ఇళ్లకు ఇంటి నంబర్, తాగునీటి నల్లా కనెక్షన్ మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని,
ఇప్పటికే నిర్మించబడిన ఇళ్లలో కూడా వీలైనంత మేర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డు పరిధిలో వచ్చే నెల రోజుల్లో కనీసం 30 ఇంకుడు గుంతలు నిర్మించేలా వార్డు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సోక్పిట్లు ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
రహదారులపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని, ప్రజారోగ్యానికి భంగం కలిగించే పరిస్థితులు ఎక్కడా తలెత్తకుండా మున్సిపల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






