భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక జారీ: జిల్లా కలెక్టర్ అంకిత్
ఈరోజు ఉదయం 10:14
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 10:14 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43.00 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక (First Warning) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పుకార్లను నమ్మవద్దని, గోదావరి నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కోరారు. 24×7 ఫ్లడ్ కంట్రోల్ రూమ్: 08744-241950 వాట్సాప్ నెంబర్ 9392919743 లను సంప్రదించాలన్నారు.






