గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన శాంతిఖని కార్మికుడు మంతెన భాస్కర్
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు. అందులో ప్రతిభ కనపరచిన కొంతమందిని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.
అందులో బెల్లంపల్లి పట్టణానికి చెందిన మంతెన భాస్కర్ ఉన్నారు. మంతెన భాస్కర్ హైదరాబాదు గచ్చిబౌలిలో విక్టరీ ఆడిటోరియంలో జరిగిన "గిన్నిస్ అచీవర్స్ మీట్" కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ మెడల్ అందుకున్నారు. భాస్కర్ కు పదేళ్ల వయసు ఉన్నప్పుడే 1996లో తండ్రి రాజయ్య శాంతిఖనిలో గని ప్రమాదంలో మృతి చెందారు.
అప్పట్నుంచి తల్లి పోసమ్మే నలుగురు పిల్లలను అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. సోదరుడు రమేష్ వారసత్వంగా వచ్చిన తండ్రి ఉద్యోగం చేపట్టి కుటుంబాన్ని పోషించారు. పిన్న వయసు నుంచి కష్టాలు,నష్టాలను చవిచూస్తూ పెరిగిన భాస్కర్ బాగా చదువుకొని సింగరేణి సంస్థలో 2018 లో ఇచ్చిన నోటిఫికేషన్ తో ఎలక్ట్రిషియన్ ఉద్యోగం సాధించాడు. 2018లో శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో చేరారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన భాస్కర్ ను శాంతిఖని గని అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు, బంధుమిత్రులు ప్రశంసించారు.






