వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
అధికారులకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం
షాద్నగర్, మార్చి 6 (విజయక్రాంతి): రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని,పైప్లైన్ లీకేజీలు ఎక్కడైనా జరిగితే, సమాచారం అందిన వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రతి మండలానికి సంబంధించి ’సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
అమృత్ స్కీమ్ కింద చేపడుతున్న నీటి ట్యాంకుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం తో పాటు మిగిలిపోయిన పైప్లైన్ మరియు ట్యాప్ కనెక్షన్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. పట్టణంలో పైప్లైన్, కేబుల్ తవ్వకాలు జరిపేటప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య తగిన సమన్వయం మరియు అనుమతులు ఉండాలని స్పష్టం చేశారు.సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కవిత, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవీంద్ర, డిప్యూటీ ఈఈలు సందీప్, అబ్దుల్ బారి, మున్సిపల్ డీఈ నరేష్, పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.




