గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం
సాయుధ దళాలు, స్థానికులతో కలిసి ప్రధాని ఐక్యత ప్రమాణం
గాంధీనగర్: గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి(Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary) వేడుకలు నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాల్గొన్నారు. ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఏక్తా దివస్ ను పురస్కరించుకుని పటేల్ విగ్రహానికి మోదీ అంజలి ఘటించారు. హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.
సైనిక దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ దళాలకు నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిసి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. గురువారం గుజరాత్లోని ఏక్తా నగర్లో(Ekta Nagar) సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను ప్రధాని కలిశారు. సర్దార్ పటేల్ మనవడు గౌతమ్ పటేల్ తన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో కలిసి సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. "కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబాన్ని కలిశాను. వారితో సంభాషించడం, మన దేశానికి సర్దార్ పటేల్ చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు.




