18 April, 2026 | 2:56 AM

చదువుల తల్లికి సత్కారం..

18-04-2026 01:17 AM

ఆర్ధిక సాయం అందజేత,  నూతన వస్త్రాలు బహుకరణ 

మహబూబాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): చదువుకు ఏ సమస్య అడ్డు కాదని మరోసారి నిరూపించిన నిరుపేద సుంకరి హిమబిందు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం అన్నారు.

శుక్రవారం మహబూబాబాద్ లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడామైదానంలో వాకర్స్ కాఫి క్లబ్  ఆద్వర్యంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని, నడివాడ వాసి అయిన సుంకరి హిమ బిందు  ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్  ఫలితాల్లో బైపీసీ విభాగంలో  985/1000 మార్కులు సాధించగా ఆమెకు ఆత్మీయ సత్కారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదానందం హాజరై మాట్లాడారు హిమబిందులో  ఉన్న టాలెంట్ గమనించి ఆమెకు ప్రత్యేకంగా బోధనతో పాటు పరీక్ష ఫీజు కూడా స్వయంగా చెల్లించి ప్రోత్సహించగా మంచి మార్కులు సాధించిందని అభినందించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు పరకాల రవీందర్ రెడ్డి, వంగ రామన్న, డాక్టర్ బి. వీరన్న మాట్లాడుతూ హిమబిందు చిన్నప్పటి నుంచే అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. 

పదోతరగతి తర్వాత హిమబిందుకు పెళ్లి కూడా చేయగా కూతురు కూడా జన్మించిందని, అంతలోనే భర్త కూడా చనిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటు తండ్రి, అటు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన హిమబిందు తన తల్లి ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనే కాంక్షతో మానుకోట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేరి ప్రిన్సిపాల్ సదానందం, ఆద్యాపకులు కలిసి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 985/1000 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకుందని హిమబిందును అభినందించారు.

ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడతామని ప్రకటించారు.  ఈ సందర్భంగా  హిమబిందుతో పాటు తోడ్పాటు అందించిన తల్లిని , ప్రిన్సిపల్ సదానందంలను ఘనంగా శాలువాలతో సన్మానించారు.  చదువుల తల్లి హిమబిందుకు ఆర్థిక సాయంగా 27  వేల రూపాయలతో పాటు  నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఏరియా ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండ్ డాక్టర్ బి. వెంకట్రాములు, రిటైర్డ్ టీచర్లు యాదగిరి,

సుంకరి వెంకటేశ్వర్లు, ఆద్యాపకులు స్వేత, చొప్పరి శ్రీనివాస్, బాలికల పాఠశాల ఇన్చార్జి సునీత, వాకర్స్ క్లబ్ బాద్యులు చౌడవరపు సుధాకర్, బవిరిశెట్టి నాగేశ్వరరావు, చిదిరాల శరత్ కుమార్, ముల్లంగి మోహన్ రెడ్డి, మాలె కాళీనాథ్, హేమచందర్, అబ్దుల్ ఆరీఫ్, నరెడ్ల రమేష్, ఆల్టెక్ రమేష్, పింగిళి నర్సింహ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తాడూరు వెంకట్రాం నర్సయ్య, మందుల రఘు  పాల్గొన్నారు.