సర్కార్ ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం.. దోపిడీ ప్రయత్నం భగ్నం
బాపట్ల: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో అప్పికట్ల-బాపట్ల స్టేషన్ల(Appikatla-Bapatla stations) మధ్య సోమవారం తెల్లవారుజామున సర్కార్ ఎక్స్ప్రెస్లో దోపిడీ ప్రయత్నం భగ్నమైంది. బాపట్ల శివార్లలోని నల్లమడ వాగు రైల్వే వంతెన(Nallamada Stream Railway Bridge) వద్ద అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో దొంగలు చెంగల్పట్టు-కాకినాడ రైలు(Chengalpattu-Kakinada Train) ఎక్కారని, 3, 6వ బోగీలలో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న బంగారం, విలువైన వస్తువులను లాక్కోవడానికి ప్రయత్నించారని ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force) DSC అక్లేశ్వరరావు తెలిపారు.
భయపడిన ప్రయాణికులు గందరగోళం సృష్టించి రైల్వే పోలీసులకు(Railway Police) సమాచారం అందించారు. ఎవరో ఎమర్జెన్సీ చైన్ను లాగడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత దొంగలు కిందకు దూకి, చీకటి మాటున సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. వారిని వెంబడిస్తున్న సమయంలో రైల్వే పోలీసులు అనుమానితులపై తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ వారు పొలాల గుండా బాపట్ల-గుంటూరు రహదారి వైపు తప్పించుకున్నారు.
దుండగులకు చెందిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు సీసీటీవీ (CCTV) దృశ్యాలను పరిశీలిస్తూ, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. దుండగులను పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు గ్రామీణ పోలీసు బృందాలను అప్రమత్తం చేశారు. దొంగల ఆచూకీ కోసం అప్పికట్ల, బాతిపూడి పొలాల్లో విస్తృత గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.






