నార్సింగిలో దారుణం — ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. సీసీటీవీ ఆధారంగా నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశచూపి పైశాచికం
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్
మణికొండ,(విజయక్రాంతి): నార్సింగి పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించిన ఓ కామాంధుడు ఆరేళ్ల పసికందుపై అత్యాచారానికి ఒడిగట్టి కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమవడంతో ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది. బాలిక ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి రాత్రి పది గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తక్షణమే స్పందించిన పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బాలికను తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించి, రాత్రి ఒంటి గంట సమయంలో చిన్నారి మృతదేహాన్ని చూపించాడు. పసికందును అత్యంత దారుణంగా చిదిమేసినట్లు నిర్ధారణ కావడంతో మిస్సింగ్ కేసును రేప్, మర్డర్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.




