కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు
అధికారుల ఆందోళన
టెన్షన్కు గురవుతున్న ప్రజాప్రతినిధులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపాలిటీలో(Kamareddy Municipality) సోమవారం ఉదయం ఏసీబీ(Anti-Corruption Bureau) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అవినీతికి నిలయంగా మారిన కామారెడ్డి మున్సిపాలిటీ అధికారుల తీరుపై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు(ACB Officials) పక్కా పథకం ప్రకారం గుర్తుపట్టలేని విధంగా ఆ కార్యాలయంలోకి వచ్చి ఏసీబీ అధికారులమని చెప్పడంతో డ్యూటీల్లో ఉన్న అధికారులు షాక్ కు గురయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల అనుమతులు, అభివృద్ధి పనుల్లో బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేయడం వల్లనే అధికారులు తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో అవినీతి అధికారుల బిల్లుల చెల్లింపుల బాగోతం బయట పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత పాలకవర్గం చేసిన అక్రమ బిల్లుల బాగోతం పై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలకు రావడం ప్రజా ప్రతినిధుల్లో అలజడి మొదలైనట్లు తేలుస్తుంది. అక్రమాలకు పాల్పడింది అధికారుల, ప్రజాప్రతినిధుల అనేది తేలాల్సి ఉంది. ఏసీబీ అధికారుల తనిఖీలతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.




