12 March, 2026 | 3:38 PM

ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాలి

12-03-2026 12:08 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

గద్వాల మార్చి 11: లైసెన్స్ సర్వేయర్లు నిబంధనల ప్రకారం ప్రజలకు ఉత్తమమైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.బుధవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 69 మందికి లైసెన్స్ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఇప్పటికే సర్వేకు సంబంధించిన సమగ్ర శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రైవేటు భూములతో పాటు నక్షలేని గ్రామాలకు సర్వే చేయవచ్చన్నారు

ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రైవేట్ సర్వేయర్లకు పారితోషికం చెల్లించబడుతుందని తెలిపారు. ఆయా భూముల బౌండరీల సర్వేకు, ఇతర పనులకై దరఖాస్తు చేసుకున్న పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలను అనుసరించి సర్వే చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు కూడా లైసెన్స్ సర్వేయర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.

లైసెన్సు పొందిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికైన వారందరికీ కలెక్టర్ లైసెన్స్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి నూకరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ గోవిందు, వివిధ మండలాల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.