పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో నిరసన
బోధన్, జున్ 8 (విజయ క్రాంతి): బోధన్ పట్టణం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ బోధన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా కాళీ గ్యాస్ సిలిండర్ బుడ్డి (బండ) తో ‘పెరిగే ధరలకు హద్దే లేదు- ఏలేటోడికి సిగ్గే లేదు.‘ ‘మూడు నెలల్లో రెండుసార్లు ధరలను పెంచడమా - సిగ్గు సిగ్గు‘ ‘పెంచిన ధరలను వెంటనే - తగ్గించాలి‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ నిరసన తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరుగుతూ పోతున్నాయంటూ ఇది మోడీ ఘనత అని తీవ్రంగా మండిపడ్డారు. మార్చి 7న సిలిండర్ పై 60 రూపాయలు పెంచి, మూడు నెలలకి ఇప్పుడు మళ్లీ 29 రూపాయలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల పైన విపరీతమైన భారాన్ని మోపిందని ఎన్నికలకు ముందు ధరలు పెంచబోము, దేశంలో మోడీ ఇంధన వనరులకు కొదవలేదు సరిపడా ఉన్నాయి.
ధరలు పెరుగుతాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వారి మాటలు నమ్మొద్దు అంటూ చెప్పిన మోడీ నేడు ఎన్నికలు అయిపోయిన వెంటనే ధరలను పెంచుతూ దేశ ప్రజల పైన భారాన్ని మోపుతున్నారని ఈ పాపం మోడీదేనని బి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని లేనట్లయితే దేశ ప్రజలే బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పడాల శంకర్, జి సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి, ఎస్ లక్ష్మి, గంగామణి, నాగమణి, కృష్ణ, దేవయ్య, లాలయ్య, బి.సాయిలు,డి.పోశెట్టి, శంకర్, హనుమాన్లు, లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






