భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించాలి
భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
తాడిచెర్ల బ్లాక్–2, పీవీఎన్ఆర్ ప్రాజెక్టులతో ఉజ్వల భవిష్యత్తు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): భద్రతే విజయానికి పునాదని భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించాలని తాడిచెర్ల బ్లాక్–2, పీవీఎన్ఆర్ ప్రాజెక్టులతో భూపాలపల్లి ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే–5 దిగువ గనిని మొదటి పూట ప్రారంభానికి ముందు జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం–2025లో గనుల విభాగం–గ్రూపు 2లో కేటీకే–5 దిగువ గని మొత్తం ప్రథమ బహుమతి సాధించినందుకు అధికారులు, కార్మికులు, సిబ్బందిని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ ప్రతిష్ఠాత్మక విజయానికి ప్రతి కార్మికుడు చూపిన అప్రమత్తత, భద్రతా నియమాల పట్ల నిబద్ధత, సమిష్టి కృషే కారణమని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గనుల్లో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇటువంటి విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ఇదే క్రమశిక్షణ, బాధ్యతతో కూడిన పనితీరు, జట్టు స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని భద్రతా పురస్కారాలు సాధించి కేటీకే–5 గని, భూపాలపల్లి ప్రాంతం, సింగరేణి సంస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కార్మికులను ప్రోత్సహించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాల సహకారంతో తాడిచెర్ల బ్లాక్–2 సింగరేణికి కేటాయించబడటం సంస్థ అభివృద్ధికి కీలకమైన ముందడుగని తెలిపారు.అలాగే పీవీఎన్ఆర్ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులు అమలులోకి వచ్చిన తరువాత భూపాలపల్లి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగి, సంస్థ ఉత్పాదకత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భూపాలపల్లి ప్రాంతం మరింత అభివృద్ధి చెంది సింగరేణిలో ముఖ్య ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రతి కార్మికుడు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని, ప్రమాదరహిత గనుల నిర్వహణే సంస్థ అభివృద్ధికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గని అధికారి మాచర్ల రమేష్, భద్రతా అధికారి పి. అభిషేక్, గని ఇంజనీర్ శ్రీకాంత్, గాలి ప్రసరణ అధికారి రమేష్, సంక్షేమ అధికారి సందీప్, ఇతర అధికారులు, గుర్తింపు పొందిన, ప్రాతినిధ్య కార్మిక సంఘాల పిట్ కార్యదర్శులు రాజేందర్, గట్టురాజు, కార్మిక ప్రతినిధులు, సీనియర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.






