ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు & ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, ఎస్ఎస్ఏ (సంఘటన్ సృజన్ అభియాన్) కార్యక్రమాల పురోగతిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సమగ్రంగా సమీక్షించారు. తెలంగాణలో నిర్వహించిన సంస్థాగత కార్యక్రమాలపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సంఘటన్ సృజన్ అభియాన్ అమలును అభినందించారు. అదే సమయంలో, ఎస్ఎస్ఏ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలని పార్టీ నాయకత్వానికి కేసీ వేణుగోపాల్ సూచించారు.






