కంగ్టిలో జైల్భరో కేంద్ర విధానాలపై నిరసన
కంగ్టి,(విజయక్రాంతి): నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్, విత్తన బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంగ్టి మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు.కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ నాయకుడు సతీష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు.విద్యుత్, విత్తన బిల్లులను కూడా ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంగ్రామ్, శివరాజ్,ఆశా కార్యకర్తలు,అటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






