13-02-2026 12:00:00 AM
హైటెక్ సిటీలో భారీ కూల్చివేతలు
రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మాదాపూర్ హైటెక్ సిటీ మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా గురువారం హైడ్రా కాపాడింది. అధికారుల అంచనా ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.2,200 కోట్లు. ఖానామెట్ పరిధిలోని సర్వే నంబర్లు 53, 55లో అక్రమ కట్టడాలు వెలిసినట్టు ప్రజావాణిలో ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్లు, మెకానిక్ కేంద్రాలు, ఐరన్, స్టీల్ దుకాణాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య వందలాది షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను తొలగించారు. ఆక్రమణలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సేకరించిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన అధికారులు గత నెల నిర్వహించిన విచారణలో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపుతూ చుట్టుపక్కల భూమిని ఆక్రమించి నెలకు భారీ అద్దెలు వసూలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా గుర్తించారు.