23-02-2026 08:13:27 PM
పెంచికల్పేట,(విజయక్రాంతి): మండలంలోని ఎల్లూరు గ్రామంలోని ఎస్సీ వాడలో విద్యుత్ హై వోల్టేజ్ కారణంగా మరోసారి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్లు, స్విచ్బోర్డులు, టీవీలు, మొబైల్ ఫోన్లు, ఫ్రిజ్లు, ఇన్వర్టర్లు తదితర పరికరాలు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విద్యుత్ తీగలు తెగి పడిన ప్రాంతాల్లో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, దుర్గం దేవాజీకి విద్యుత్ షాక్ తగలడం ఆందోళనకు గురిచేసింది. భవిష్యత్తులో ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ దృష్ట్యా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎల్లూరు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.