ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో టేకులపల్లి, ములకలపల్లి, దుమ్ముగూడెం, గండుగులపల్లి, గుండాల, చర్ల, పాల్వంచ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, విద్యా ప్రమాణాల మెరుగుదల, తాగునీటి సౌకర్యం, క్రీడా మైదానాలు, డిజిటల్ సదుపాయాలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు సికిల్ సెల్ పరీక్షలు, వార్షిక ఆరోగ్య పరీక్షలు,
కంటి పరీక్షల శిబిరాలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ క్యాలెండర్ రూపొందించి, దాని ప్రకారం పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఏకలవ్య పాఠశాలలో పార్ట్ టైం డాక్టర్ ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా జిల్లాలోని అన్ని ఏకలవ్య పాఠశాలల్లో ఆర్ఓ సిస్టమ్తో కూడిన వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దుమ్ముగూడెం, చర్ల ఏకలవ్య పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్ కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధితో పాటు క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, పనులు చేపట్టేలా ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. అన్ని ఏకలవ్య పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, కంప్యూటర్ ల్యాబ్లను ఆధునికీకరించాలని, అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమని , కొన్ని పాఠశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో నిర్ణీత మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని , ఇకపై అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ సి ఓ అరుణకుమారి, భద్రాచలం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ పాఠశాల ప్రిన్సిపల్, ఏకలవ్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు






