22 July, 2026 | 10:01 PM

విద్యార్థులపై లాఠీ చార్జి చేసినందకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజీనామా చేయాలి

22-07-2026 09:01 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేపించడం హేయమైన చర్య అని వెంటనే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ  ప్రశ్నాపత్రాల లీకేజీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మారిందని అన్నారు.

విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొని, పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని పేర్కొన్నారు.

మానసికంగా ఆందోళన చెందిన  21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి దేశానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. యాదగిరిగుట్టలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు.