150 పోస్టులు.. వేలల్లో పోటీ
- 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 డ్రైవర్ పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్
- ఈవెంట్స్కు సరూర్నగర్ స్టేడియానికి తరలివచ్చిన నిరుద్యోగులు
- అర్హత పదో తరగతి.. డిగ్రీ, పీజీ అభ్యర్థుల క్యూ.. తోపులాట
- జాబ్ క్యాలెండర్, వయోపరిమితి సడలింపుపై ఒత్తిడి
రంగారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): రా ష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం చోటుచేసుకు న్న ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భారీగా కొలువులు ఇచ్చామని చెపుతున్నా.. నిరుద్యోగ యువతకు నిరాశే మిగులుతోందని స్పష్టమవుతున్నది. హైడ్రా చేపట్టిన తాత్కాలిక డ్రైవర్ల నియామకాల వేళ నిరుద్యోగుల ఆక్రందన మళ్లీ రోడ్డెక్కింది.
హైడ్రా పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఅర్ఎఫ్) అసిస్టెంట్లు, 50 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈవెంట్స్ చేపట్టారు. కేవలం 150 తాత్కాలిక పోస్టుల కోసం ఏకం గా వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. పదో తరగతి అర్హత ఉన్న ఈ ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్యావంతులు సైతం బారు లు తీరడంతో తోపులాట జరిగింది.
అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఎంపిక (ఈవెంట్స్) ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు చేతులెత్తేశారు. టోకెన్లు ఉన్నవారు మాత్రమే ఉండాలని, లేనివారు వెళ్లి పోవాలని ఆంక్షలు విధించడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని గుర్తిస్తామని హెచ్చరించడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కాంట్రాక్ట్ పోస్టుల వద్ద కనిపించిన దృశ్యాలు కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు.. అది రాష్ట్రంలోని లక్షలాది మంది యువత అంతరంగ ఆవేదన.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అశోక్ నగర్, సరూర్నగర్ కేంద్రాలను సందర్శించి నిరుద్యోగులకు కొలువుల భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత కొన్ని నోటిఫికేషన్లు వచ్చినప్ప టికీ, ఏళ్ల తరబడి పడిన కష్టానికి తగిన ఉద్యోగాలు దక్కకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర అ సంతృప్తి వెల్లువెత్తుతోంది. కరోనా కష్టాలు, గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఆల స్యం కావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది వయో పరిమితి దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రకటించిన ఖాళీల కంటే వాస్తవంగా ఉన్న ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని, మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.






