16 June, 2026 | 10:09 PM

మీ సురక్షతో నాచారం వాసులకు పోలీసులు అలర్ట్

16-06-2026 09:03 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న “మీ సురక్ష” కార్యక్రమంపై నాచారం పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రహజ విస్త ఆపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్, ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటయ్య, పోలీసు సిబ్బందితో కలిసి స్థానికులను కలిసి “మీ సురక్ష” పోర్టల్ ప్రాధాన్యాన్ని వివరించారు.

నగరంలో ఇటీవల నేపాలి ముఠాల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ ధనంజయ గౌడ్ సూచించారు. ఇళ్లలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాచ్‌మన్‌లు, అద్దెకు నివసించే వ్యక్తులు, అలాగే ఒంటరిగా నివసించే వృద్ధుల పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించాలని కోరారు.ఇలా వివరాలు నమోదు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు, అనుమానితుల గుర్తింపుకు సహాయపడుతుందని తెలిపారు.

మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, “మీ సురక్ష” ప్రత్యేక పోర్టల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు తమ కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, నివాస ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతి భద్రతలు కాపాడగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఫ్రాన్సిస్ పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.