యూరియా కోసం రైతుల అవస్థలు
* ఇతర ఎరువులు కొనాలంటూ ఒత్తిడి
* వడ్డీ ఇవ్వాలంటూ రషీద్ పై ముద్ర
* ఫెర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో వెంకటసాయి ఫర్టిలైజర్స్ వద్ద కొండాపూర్, నామాపూర్, గన్నేవానిపల్లె, మోర్రాపూర్, గోపాల్ పల్లె, సేవాలాల్ తండా, ముస్తాబాద్ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. ఈ సందర్బంగా రైతులు తెలిపిన కథనం ప్రకారం యూరియా కోసం ఉదయం నుండి షాప్ దగ్గర వేచి యున్నామని ఆరోపించారు. యూరియా బుక్ చేసుకున్నప్పటికీ "ఇతర ఎరువులు కూడా కొనాలని, లేకపోతే బుకింగ్ రద్దు చేసుకోండి" అంటూ షాపు యాజమాన్యం దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వాపోయారు.
నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా ఇవ్వాలని కోరగా"మీరు మా దగ్గర ఎందుకు బుక్ చేసుకున్నారని మమ్మల్నే ప్రశ్నించారు ? మా గ్రామ రైతులకే యూరియా ఇస్తాం" అంటూ దుకాణం యజమాని పేర్కొన్నట్లు రైతులు తెలిపారు. ఎరువుల అమ్మకాలు చేస్తూ డబ్బులు చెల్లించే సమయానికి వందకు 2 చొప్పున వడ్డీ చెల్లించాలంటూ దర్జాగా బిల్లులపై స్పష్టంగా ముద్రణ చేశారని వెల్లడించారు. ఎమ్మార్పీ ధర కంటే అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి వాస్తవాలు పరిశీలించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.






