చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత
- లాడ్జీలు, రిసార్ట్లు, హోటళ్లు, ఫాంహౌస్ యాజమాన్యాలకు సీపీ హెచ్చరిక
- ఉద్యోగులు, కస్టమర్ల వివరాలను నమోదు చేయాలని సూచన
సిద్దిపేట క్రైం: లాడ్జీలు, రిసార్ట్లు, హోటళ్లు, ఫాంహౌస్ లలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేటలోని లాడ్జీలు, రిసార్ట్లు, హోటళ్లు, ఫాంహౌస్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించి పలు కీలక సూచనలు చేశారు.
ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ప్రాంగణంలో నాణ్యమైన సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కనీసం 60 రోజుల వరకు బ్యాకప్ ఉండేలా చూడాలని సూచించారు. సంబంధిత పోలీస్ స్టేషన్, ఎస్ హెచ్ వో ఫోన్ నంబర్లను నోటీస్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ప్రత్యేక ద్వారాలు ఉండేలా చూడాలని, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పని చేసే ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీపై ప్రాథమిక శిక్షణ కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగుల వివరాలను కచ్చితంగా పరిశీలించాలని, మైనర్లు ఉద్యోగాల్లో ఉండకూడదని సూచించారు.
నకిలీ ఆధార్ కార్డుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈవెంట్లు, కార్యక్రమాల వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని సూచించారు. లాడ్జీలు, హోటల్స్, ఫాంహౌస్లలో బసకు వచ్చే కస్టమర్ల పూర్తి వివరాలను ప్రతిరోజూ పోలీస్ స్టేషన్కు అందజేయాలని, వారు నిర్వహించే ప్రోగ్రాములకు పోలీస్ అనుమతి తీసుకున్నారా లేదా తెలుసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కుషాల్కర్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






