17 July, 2026 | 9:10 PM

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

17-07-2026 09:05 PM

- మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా డిమాండ్

కొత్తగూడెం,(విజయక్రాంతి): మైనార్టీ గురుకుల విద్యాసంస్థల పునర్వ్యవస్థీకరణ పేరుతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్యాయమని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా విమర్శించారు. మైనార్టీ కార్యదర్శి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 206 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 206 మంది డిప్యూటీ వార్డెన్లు, 206 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

అలాగే రాష్ట్రంలోని సుమారు గల 60 మైనార్టీ జూనియర్ కళాశాలల్లో 60 మంది డిప్యూటీ వార్డెన్లు,60 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యోగులందరూ చాలీచాలని వేతనాలతోనూ, పూర్తి నిబద్ధతతోనూ విధులు నిర్వర్తిస్తూ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడుతున్నారని యాకూబ్ పాషా అన్నారు. అయితే, అకస్మాత్తుగా జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా ఈ ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మైనార్టీ గురుకుల ఉద్యోగుల సేవా భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇటువంటి నిర్ణయాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో, మైనార్టీ గురుకుల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా హెచ్చరించారు.