సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్
కోనరావుపేట(విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలకే పరిమితమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ విమర్శించారు. కోనరావుపేట మండలం లోని ధర్మారం గ్రామంలో జరుగుతున్న సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా వారు మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలో అప్పర్ మానేరు, మల్కపేట రిజర్వాయర్లు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని, బోర్బావులపై ఆధారపడుతున్న రైతులకు సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి తాగునీరు, సాగునీటి అవసరాలపై సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని, అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.నేత కార్మికుల కోసం నిర్మించిన "వర్కర్ టు ఓనర్" షెడ్లను వెంటనే కేటాయించి, మిషన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని, లేనిపక్షంలో పేదలను సమీకరించి ఆ ఇళ్లలోకి పంపిస్తామని హెచ్చరించారు.






