20-02-2026 05:38:53 PM
పేర్ల నాగయ్య, సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి
తుంగతుర్తి(విజయక్రాంతి): కర్రెగుట్టలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని సిపిఐ(ఎం-ఎల్)మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలోఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2026 మార్చ్ 31 వరకు దేశాన్ని నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటనలు చేస్తూ, కర్రెగుట్టలో కొన్ని వేల మంది సైన్యాన్ని దింపి, వందలాది క్యాంపులు నిర్వహిస్తూ, నక్సల్స్ పేరుతో ఆదివాసి బిడ్డలను హత్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నరమేధాన్ని వెంటనే ఆపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. దండకారణ్య బస్తరు జిల్లాలలో విస్తారంగా లభించే సహజ ఖనిజ సంపద,అడవి సంపదను అంబానీ,ఆదానీలకు దోచిపెట్టుట కొరకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే నక్సల్స్ పేరుతో ఆదివాసి బిడ్డలను హత్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒకవేళ అక్కడి ప్రజలు ఏమైనా దేశద్రోహానికి పాల్పడ్డారని అనుమానం కలిగితే భారత రాజ్యాంగం ప్రకారం వారిని శిక్షించాలి కానీ, శత్రు దేశాల సైన్యాల మీద యుద్ధం చేసినట్లుగా సొంత ప్రజల మీద యుద్ధం చేయడం ఫాసిస్టు విధానమని ఆయన అన్నారు. ఈ నరమేధాని వెంటనే ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ ఈ నర మేధాన్ని ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.