సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
టీబీ నిర్మూలనకు స్క్రీనింగ్ను వేగవంతం చేయాలని, మాతా-శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నెల 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి సిబ్బంది కృషి చేయాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.






