మోదీ.. మీ సలహాలు మాకొద్దు
ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : బంగారం కొనుగోలు చేయొద్దని, పెట్రోల్, డీజిల్ వాడొద్దని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ హితబోధ చేయడం ఆశ్యర్యంగా ఉందని, మీ ఉచిత సలహాలు మాకొద్దని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అంబర్పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గుజరాత్కు చెందిన బడా పారిశ్రామిక వేత్తలు అంబానీ, ఆదానీల వద్ద లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని, దేశం కిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వారే ఆదుకోవాలన్నారు.
దేశ బడ్జెట్ ఎంత ఉందో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తుల వద్ద అంతకంటే ఎక్కువ ధనం ఉందన్నారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును ప్రజలకిచ్చే విధంగా వారిని మోదీ ఒప్పించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. మోదీ ప్రధానమంత్రి కావడానికి గుజరాత్ కు చెందిన వ్యాపారులు అడ్డుకున్నారని, ఇప్పుడు దేశ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.






