99 రోజుల కార్యాచరణ ప్రగతి ప్రణాళికపై సమీక్షించిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల అధికారులతో పాటు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, గ్రామాల్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో ఇప్పటికే పరిష్కారమైన సమస్యలు, ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలపై సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట బోర్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
అలాగే త్వరలో ప్రారంభం కానున్న రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు విధానంపై కూడా సమగ్రంగా చర్చించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందేలా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి లోపం లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.




