22 April, 2026 | 8:13 PM

నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం

22-04-2026 06:51 PM

– మాజీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మునుగోడు,(విజయక్రాంతి): గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.72 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత మాజీ కార్యదర్శి మానస, మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజు గౌడ్ కలిసి ఎలాంటి ఎంబీలు (అంచనాలు) లేకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, తమ ఇష్టానుసారం నిధులను డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి (డిపిఓ) ఫిర్యాదు చేయగా, నిర్వహించిన విచారణలో అవకతవకలు జరిగినట్టు తేలినట్లు తెలుస్తోంది.

ఇంటి పన్నులు, నల్ల బిల్లులు పేరుతో కూడా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ప్రస్తుత పాలకవర్గంలోని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నారు.గత నెల 31వ తేదీన సంబంధిత మాజీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, ఆమెపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ,ఈ నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారులపై రెవెన్యూ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి, మాజీ కార్యదర్శి మానసను ఉద్యోగం నుంచి తొలగించాలని గ్రామ పాలకవర్గ సభ్యుడు ఆనగంటి కృష్ణ డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.