రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు
హైదరాబాద్: వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పాల్గొన్నారు. తెలంగాణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రుడిలా మారిపోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదని ఆయన పేర్కొన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినా, అందులో ఒకరు కాంగ్రెస్ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినా స్పీకర్ కి ఏమీ పట్టట్లేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ ఒప్పుకోలేదు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమే అని, కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.






