ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య
నవాబ్పేట గ్రామపంచాయతీ పరిధి నాగేపల్లిలో విషాదం
పెద్దపల్లి జిల్లా, జూలై 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని నవాబ్పేట గ్రామపంచాయతీ పరిధిలోని నాగేపల్లి గ్రామంలో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోడకుర్తి సుజాత (25) ఎంసీఏ చదువుతోంది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చాక ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో నాగేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






