ఇంటిపై జాతీయ పతాకం ఆవిష్కరించిన మేయర్
ముకరంపుర,(విజయక్రాంతి): భారత ప్రదానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం మాత్రమే కాదని, దేశభక్తి భావనను ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరవేసే మహత్తర జాతీయ ఉద్యమమని పేర్కొన్నారు.
భారత జాతీయ పతాకం మన ఐక్యతకు, సమైక్యతకు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గౌరవానికి, దేశ సార్వభౌమాధికారానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి పౌరుడు తన ఇంటిపై గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తిని చాటాలని మేయర్ పిలుపునిచ్చారు.






