విద్యార్థులకు చిన్న వయస్సులోనే బాధ్యతాయుత భావనలు పెంపొందించాలి
- మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు
హాజీపూర్,(విజయక్రాంతి): చిన్న వయస్సులోనే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావనలను పెంపొందించాలని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడి పేటలో గల కేంద్రీయ విద్యాలయంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ లతో కలిసి ఆయన మాట్లాడారు.
కేంద్రీయ విద్యాలయాలలో చిన్న వయసు నుంచే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అభినందనీయమని, జీవితంలోని ప్రతి రంగంలోనూ నాయకత్వ లక్షణాలు అవసరమన్నారు. కేంద్రీయ విద్యాలయాల విధానం దేశవ్యాప్తంగా విద్యార్థులకు బహుభాషా, బహుసాంస్కృతిక, బహుప్రాంతీయ వాతావరణాన్ని కల్పిస్తుందని, కుల, మత, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయక వాతావరణాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
విద్య కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకూడదని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా విద్యార్థులను సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబంతో పాటు గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను మంచి విద్యాసంస్థలలో చదివిస్తున్నారని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థులు సవాళ్లను స్వీకరించి ఉన్నత లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా స్వీకరించి, సరైన మార్గంలో పయనిస్తూ తమ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గతంతో పోల్చితే కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల సంఖ్య దాదాపు రెట్టింపు కావడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం 600 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చదువుకోవడం, పరస్పరం నేర్చుకోవడం వల్ల వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
పాఠ్యాంశాలతో పాటు క్రీడలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థులలో సమగ్ర వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాఠశాల జీవితం భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేసే వేదిక అని తెలిపారు. జీవితంలో లక్ష్యాలను సాధించడం కొరకు సరైన మార్గంలో పయనించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. విద్యతో పాటు సంగీతం, నృత్యం, క్రీడలు, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వివిధ రంగాలలో పాల్గొనడం ద్వారా సమగ్ర వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






