సర్కార్ స్థలాలు కాపాడండి
ముకరంపుర,(విజయక్రాంతి): కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడిందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు అవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా తీసుకుని కొంత మంది ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని చెప్పారు. శనివారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో బోయినిపల్లి ప్రవీణ్ రావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. తన డివిజన్ పరిధిలోని వివేకానంద స్వామి విగ్రహ స్థలం ప్రభుత్వానిదే అయినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడంతో కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ కోర్టుకు వెళ్లారని తెలిపారు.
దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. కార్పొరేషన్ పరిధిలో పలు ప్రభుత్వ స్థలాలను పట్టించుకోకపోవడంవల్ల అవన్నీ అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుని సరైన డాక్యుమెంట్స్, ఆధారాలు చూపి ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. లేనిపక్షంలో కబ్జాదారులతో కుమ్కక్కై అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే అపవాదు మోయాల్సి వస్తుందని హెచ్చరించారు.






