హెజెలో సంస్థలో భారీ ప్రమాదం
- ఇద్దరు కార్మికుల మృతి
- పేలిన కెమికల్ రియాక్టర్
- పలువురి పరిస్థితి విషమం
చౌటుప్పల్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పోచంపల్లి మండలం దోతీగూడెం పరిధిలోని హెజెలో సంస్థలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సుమారు 10 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో పాటు మంటలు చెలరేగాయి.
పేలుడు శబ్దంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా ప్ర మాణాల అమలుపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్మికుల భద్రతను పట్టించుకోకుం డా నిర్వహిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజలు డిమాండ్ చేశారు.






