అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్
కామారెడ్డి,(విజయక్రాంతి): అక్షర ఆయుధంతో అనాచివేతపై పోరాడిన దేశాలు మాత్మ జ్యోతిబాపూలే అని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్, విజయ్ కుమార్ మాట్లాడుతూ... "విద్య కేవలం కొందరి సొత్తు కాదని, అది అందరికీ అందాలని పరితపించిన మహోన్నత వ్యక్తి పూలే" అని కొనియాడారు. విద్యకు ఆమడ దూరంలో ఉన్న వర్గాల కోసం, బాలికల కోసం పాఠశాలలను స్థాపించి జ్ఞాన విప్లవానికి ఆయన పునాది వేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం 'సత్యశోధక సమాజ్'ను స్థాపించి, సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేసిందని ప్రశంసించారు.
వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాల,మహిళల అభ్యున్నతే ధ్యేయంగా పూలే సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. "దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలు వంటివారు" అన్న పూలే మాటలను గుర్తు చేస్తూ .. యువత ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని సామాజిక మార్పుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. భయం వీడి ఆత్మగౌరవంతో ఎలా బతకాలో పూలే జీవితం మనకు నేర్పుతుందన్నారు.




