పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. తారామతి బారామతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్ లను ఆధునీకరించాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
టూరిజం హబ్ డెవలప్ మెంట్ పథకం(Tourism Hub Development Scheme) కింద వికారాబాద్ ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్ వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వీరభద్రస్వామి ఆలయానికి యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలోని అటవీశాఖ భూములను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలోని మరిన్ని పార్కులు, ఫ్యూచర్ సిటీలోని అటవీశాఖ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.






