కనీవినీ ఎరుగని రీతిలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకొందాం..
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 3(విజయక్రాంతి): ఈనెల 5వ తేదీన ఆదివారం కరీంనగర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 119 జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనీవినీ ఎరగని రీతిలో ఘనంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
ఈనెల 5వ తేదీన జరగనున్న మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పక్కన జగ్జీవన్ రావు విగ్రహం వద్ద నిర్వహించే వేడుకలకు అధికారులు ప్రజాప్రతినిధులు దళిత సంఘాల నాయకులు వివిధ గ్రామాల నుంచి దళితులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించాలని పేర్కొన్నారు. ఈసారి గతంలో కంటే కనీవినీ ఎరగని రీతిలో మును పెన్నడు జరగని విధంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతోత్సవాలను నిర్వహించుకుందామని తెలిపారు. అదేవిధంగా ఈనెల 14వ తేదీన భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.




