కోనరావుపేటలో న్యాయ అవగాహన శిబిరం విజయవంతం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా గ్రామంలో జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన శిబిరం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నరేష్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, రైతులు, కార్మికులకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.శిబిరంలో పాల్గొన్న న్యాయవాదులు గ్రామ ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించారు.భూమి వివాదాలు, కుటుంబ సమస్యలు, గృహ హింస, కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై వివరంగా తెలియజేశారు. అదనంగా ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అడిపు వేణు, గుర్రం ఆంజనేయులు, మధుసూదన్, ఏఎస్ఐ తిరుమల బాబు, ఉప సర్పంచ్ రాజు నాయక్, వార్డు సభ్యులు దేవేందర్, నారాయణ, సరిత, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువత మరియు ఇతర గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ శిబిరం ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని సర్పంచ్ నరేష్ నాయక్ ఆకాంక్షించారు.






