25 April, 2026 | 10:28 PM

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

25-04-2026 08:46 PM

- జీఎం మునిగంటి శ్రీనివాస్ 

నస్పూర్,(విజయక్రాంతి): గత స్ట్రక్చర్డ్ సమావేశంలో తమ పరిధిలో పరిష్కరించ దగిన వాటిని దాదాపుగా పూర్తి చేశామని, కార్పోరేట్ పరిధిలో ఉన్న అంశాలను, ఇతరత్ర అనుమతులతో చేపట్టాల్సిన పనులు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని జీఎం మునిగంటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు సంఘం ప్రతినిధులతో నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో మార్చి నెల స్ట్రక్చర్ కమిటీలో యాజమాన్యం దృష్టికి తెచ్చిన సమస్యల పై చర్చించి, గత సమావేశంలో లెవనెత్తిన అంశాల పరిష్కారానికి చేపట్టిన చర్యలు, పరిష్కరించి సమస్యల వివరాలు గుర్తింపు సంఘం ప్రతినిధులకు అందజేశారు.

అనంతరం ఏప్రిల్ నెల స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఏరియా పరిధిలోని వివిధ గనుల్లో ఉద్యోగుల సౌకర్యార్ధం చేపట్టాల్సిన కార్యక్రమాలను జీఎం దృష్టికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులు తీసుకువచ్చారు. అన్ని గనులు, పని ప్రదేశాలలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధన లక్ష్యంగా అవసరమైన పనిముట్లు, యంత్రాల సమీకరణ వివరాలతో పాటు ఉద్యోగుల సౌకర్యార్ధం గనుల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన అంశాలను జీఎం దృష్టికి  తీసువచ్చారు. ఉద్యోగుల పదోన్నతులు, హెచ్బీఎల్ఆర్ఎస్ స్కీం వడ్డీ చెల్లింపులో జాప్యం లేకుండా జరిగేలా చూడాలని కోరారు.

వీటితో పాటు సంక్షేమానికి సంబందించి ఉద్యోగుల నివాసముండే కాలనీలు, క్వార్టర్లలో చేపట్టాల్సిన మౌళిక సదుపాయాలతో పాటు డిస్పెన్సరీలలో కల్పించాల్సిన వసతుల వివరాలు అందించారు. గుర్తింపు సంఘం ప్రతినిధులు సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ హామి ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం సౌకర్యార్ధం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టేందుకు సంస్థ సిద్దంగా ఉందని, ఉద్యోగులు, కార్మిక సంఘాలు నాణ్యమైన ఉత్పత్తి ద్వారా సంస్థ దీర్ఘకాల మనుగడకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ బ్రాంచీ సెక్రటరీ బాజీ సైదా, ఎస్ఓ టూ జీఎం N . సత్యనారాయణ, డీజీఎం(ఐఈడీ) రాజన్న, డీజీఎం(పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ , డీజీఎం(సివిల్)  కే. ఆనంద్ కుమార్, ఏరియా ఇంజనీర్ టీ. రమణ రావు,  సీనియర్ పీఓ ప్రశాంత్ , అన్ని గనుల ఏజెంట్లు, విభాగాధిపతులు , అధికారులు, గుర్తింపు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.