21 April, 2026 | 1:52 PM

తెలంగాణ సత్తెమ్మ మృతి.. నివాళులర్పించి పాడె మోసిన కేటీఆర్

19-04-2026 02:04 PM

హైదరాబాద్: వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి ఆయన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ అత్యంత చురుకైన పాత్ర పోషించారని, ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, జై తెలంగాణ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని కేటీఆర్ స్మరించుకున్నారు.

స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.