6 May, 2026 | 12:59 AM

పాలమూరు నుంచే కవితమ్మ తొలి అడుగు

06-05-2026 12:00 AM

8న చౌదరిగూడెం వద్ద పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ

షాద్నగర్ మే 5 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి, ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవితమ్మ అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారని అబ్నారు.

8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని కవితమ్మ అదే రోజు సాయంత్రం పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అని తెలియజేశారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కృష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారని. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవితమ్మ స్పష్టం చేశారని అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని కూడా వారు ప్రకటించారు.