ఎల్ నినో కబంధహస్తాల్లోకి భారత్
- జూన్ నెలలో వర్షపాత లోటు ౩౯%
- ౧౨౬ ఏళ్ల చరిత్రలో ఇదే అతి తక్కువ వర్షపాతం
- జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు
- ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఎక్కువే..
- ఐఎండీ జూన్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ ౩౦: భారత్ ‘ఎల్ నినో’ కబంధహస్తాల్లోకి వెళ్లిన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. జూలైలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. తక్కువ వర్షపాతం కారణంగా పగటి, రాత్రి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. వర్షపాత లోటు ఉన్న ప్రాంతాల్లో ఉక్కపోతలూ ఉంటాయని పేర్కొంది.
ముగిసిన జూన్లో ౧౨౬ ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతితక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నెలలో 165 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా, 39 శాతం తక్కువ వర్షపాతం రికార్డయింది. ఇక జూలై విషయానికి వస్తే సాధారణ వర్షపాతం ౨౮౦ మి.మీ కంటే, సుమారు ౯౦ శాతం తక్కువ నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తున్నది. మధ్య, పశ్చిమ, ఉత్తర భారతంలో మోస్తరుగా, వాయువ్య, తూర్పు మధ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈశాన్య భారతంలో మిగిలిన అన్నిప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయరంగానికి ఆయువుపట్టున ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లో వర్షపాతం అమాంత పడిపోయింది. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఫర్వాలేదనే విధంగా వర్షపాతం నమోదైంది.
తగ్గిన సాగు విస్తీర్ణం
రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వానాకలం సాగు దాదాపు 23 శాతం తగ్గింది. మృత్తికలో తగినంత తేమ లేకపోవడం వల్ల వరి, పప్పుధాన్యాలు, సోయాబీన్, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది. జూలై నెల అంచనాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, అటుపై రుతుపవనాల కదలికల్లో కొంత మెరుగుపడొచ్చని ఐఎండీ ఆశిస్తున్నది.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) సానుకూలంగా మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణ బ్యూరో ఇటీవల ప్రకటించింది. భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం.. 1901 నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే జూన్ మాసంలో దేశవ్యాప్తంగా 100 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1905లో 92.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం విషయంలో అత్యంత దారుణమైన సంవత్సరంగా 2009 నిలిచింది. ఆ సమయంలో జూన్ నెలలో కేవలం 87.5 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, ఈ ఏడాది జూన్ నెల ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించనుంది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా, ఆ తర్వాత సుమారు 11 రోజులపాటు ఒకే చోట నిలిచిపోయాయి. ఈ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ స్పందిస్తూ.. జూన్ నెలలో వర్షాలు ఆశాజనకంగా లేవనేది వాస్తవమని, కానీ.. రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.






