ఐఈఏ కీలక నిర్ణయం.. 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల
టెహ్రాన్: అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం దృష్ట్యా ప్రపంచ ఇంధన మార్కెట్లపై(Fuel market) ఒత్తిడిని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. 2022 ఉక్రెయిన్ యుద్ధంలో విడుదల చేసిన 182 మిలియన్ బ్యారెళ్ల కంటే ఇది ఎక్కువని తెలిపింది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (International Energy Agency)లో అసోసియేట్ సభ్యుడిగా, అంతర్జాతీయ ఇంధన సహకారంలో చురుకైన భాగస్వామిగా, సరఫరాలో అంతరాయాల మధ్య అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయాలనే ఐఈఏనిర్ణయాన్ని భారతదేశం స్వాగతించిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రపంచ మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని పేర్కొంది.




