లారీని ఢీకొన్న అద్దె బస్సు
- టికెట్ ఇస్తూ డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణం
- ఆరుగురికి గాయాలు
- కరీంనగర్ మీదుగా వరంగల్ వెళ్తుండగా ప్రమాదం
కరీంనగర్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఆర్టీసీ సమ్మె కరీంనగర్లో బస్సు ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ టిక్కెట్ ఇస్తూ డ్రైవింగ్ చేస్తుండగా అదుపుతప్పి బస్సు లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను నడిపిస్తున్నారు.
కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్కు వెళ్తుండగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.






