సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం
డీన్ డా. హేమంత కుమార్
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు
ఏఎంసి చైర్మన్ బి.నీరజా దేవి
కల్లూరు,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జె. హేమంత కుమార్, డా. ఎ.శ్రీజన్ పాల్గొనగా, కల్లూరు మండలంలోని కొర్లగూడెం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసి చైర్పర్సన్ బి. నీరజా దేవి మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, సిఫారసు చేసిన మేరకు ఎరువుల వినియోగం, పంట మార్పిడి,సాగునీటి ఆదా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వరి పంట విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఆయిల్ పామ్ సాగును పెంచితే రైతులకు అధిక లాభాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరు కీలక అంశాలపై దృష్టి సారించి రాబోయే వానాకాల పంటలకు సిద్ధం కావాలని సూచించారు.
అలాగే వివిధ పంటల్లో చీడపీడల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు అందించారు. డా.ఎ.శ్రీజన్ సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఎమ్.రూప, కొర్లగూడెం సర్పంచ్ ఎమ్. నాగజ్యోతి, వ్యవసాయ విస్తరణాధికారి కె.వేంకట రమణ, డిసిసి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ వి. ప్రవీన్ కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ బి. సత్యనారాయణ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.






