బాన్సువాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం గరంగరం
లేఅవుట్ చేయకుండానే ప్లాట్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు..
వెంచర్ల పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి..
డిటిసిపి అనుమతులు ఉన్న ప్లాట్లకే రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఇవ్వాలి...
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..
సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల డిమాండ్..
బాన్సువాడ, జూన్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం గురువారం గరం... గరం... గా సాగింది. మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్ అధ్యక్షతన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికపై సభ్యులు చర్చించారు. పలు కాలనీల్లో నిలిచిపోయిన సిసి రోడ్లు, డ్రైన్ ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.
అక్రమ వెంచర్, నిర్మాణాలు, అనుమతులు రద్దు చేయాలి ఎం.ఏ.హకీమ్,3 వార్డు కౌన్సిలర్ డిమాండ్..
బాన్సువాడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతోందని, అయితే కొందరు వెంచర్ల నిర్వాహకులు లేఔట్ చేయకుండానే ప్లాట్లను విక్రయిస్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారని 3వ వార్డు కౌన్సిలర్ హకీమ్ ఆరోపించారు. నాన్ లేఔట్లో ప్లాట్లు విక్రయిస్తూ మోసం చేస్తున్నారని, ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు ఇండ్ల నిర్మాణం కోసం మున్సిపాలిటీలో పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాన్ లేఔట్ కావడంతో అధికారులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.
నాన్ లేఔట్ ప్లాట్లను విక్రయించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, హద్దు రాళ్లను తొలగించాలని సూచించారు. నాన్ లేఔట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని నిబంధన ఉన్నా రిజిస్ట్రేషన్ అధికారులు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, దీనివల్ల వాటిని కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు మున్సిపల్ అధికారులు లేఖ రాసి వాటిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. డిటిసిపి అనుమతి ఉన్న ప్లాట్లకే రిజిస్ట్రేషన్ లు, అనుమతులు ఇవ్వాలని సూచించారు.
భారత్ గార్డెన్ నుంచి పార్కుకు వెళ్లే రోడ్డు 40 ఫిట్ల రోడ్డుపై అక్రమ నిర్మాణం జరుగుతోందని, ఆపాలని డిమాండ్ చేశారు.పట్టణంలో ఎక్కడపడితే అక్కడ అనుమతి లేని ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారని, అలాంటి ఇళ్లను గుర్తించాలని కోరారు. గ్రౌండ్ ఫ్లోర్కు పర్మిషన్ తీసుకొని మొదటి, రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్న ఇళ్లు కూడా ఉన్నాయని, వాటిని గుర్తించి టాక్స్లను రివైజ్ చేయాలని కోరారు.రానున్న వర్షాకాలం దృష్ట్యా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి పనులను ఎప్పటికప్పుడు చేయాలని పలువురు కౌన్సిలర్లు సూచించారు.
అనంతరం సమావేశములో ఎజెండా అంశములో వార్డులకు సంబంధించిన అభివృద్ది పనులపై చర్చలు జరుపగా హాజరైన సభ్యులు ఆమోదం తెలపడం జరిగినది. రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, మిషన్ భగీరథ శాఖ, రోడ్లు భవనాల శాఖ తదితర శాఖ అధికారులతో పట్టణ అభివృద్ది, పట్టణంలోని ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరపి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని వారికి తెలపడం జరిగినది.ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ రేష్మాబేగం ఎజాజ్,కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు లింగం, ఖాలిక్, చంద్రశేఖర్, నస్రీన్ ఫెరోజ్, ఖమర్ సుల్తానా గౌస్, రుక్మిణి అంజాగౌడ్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ముజ్జు, కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్, MIM కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.






