వడ్ల బీటిలో ప్రమాదం – హమాలి కార్మికుడికి తలకు తీవ్ర గాయం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని రామచంద్రపూర్ గ్రామ వడ్ల బీటిలో నిన్న ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. వడ్లను లారీలో లోడ్ చేసి తాడు కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడంతో ఇనుప రింగు వేగంగా వచ్చి హమాలి కార్మికుడు పొన్నాల చక్రపాణి తలపై బలంగా తాకింది.
ఈ ఘటనలో చక్రపాణికి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అక్కడున్న సహచరులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయాన్ని పరిశీలించి ఐదు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో వడ్ల బీటిలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు గురయ్యారు. లోడింగ్, అన్లోడింగ్ పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని స్థానికులు కోరుతున్నారు.






