యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వం విఫలం
ఏఐవైఎఫ్ విమర్శలు
మునుగోడు,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంటులో భగత్ సింగ్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరారు.
దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి ఉరికంబాన్ని ఎక్కిన మహానీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేటి యువత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ, ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేపడుతున్న యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలని, భారత ప్రధాని మౌనం వీడి శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బండారు శంకర్, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కట్కూరి లింగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి గోపగోని ఉదయ్, నాయకులు రాసమల్ల మహేష్, అందుగుల నరేష్, చింతల రమేష్, గజ్జల కిషన్, బద్దుల శశి, చివర్ల నాగరాజు, శివ, ధనుంజయ్, కార్తీక్ ఉన్నారు.




