గిరిమార్ట్ను ప్రారంభించిన గవర్నర్ ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, మార్చి 27, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణం ప్రజలకు మరియు ఆదివాసి గిరిజన గ్రామాలలోని ప్రజలకు గిరిజన మహిళలు స్వతహాగా తయారు చేసే పౌష్టికారమైన ఆహార పదార్థాలతో పాటు ఆర్గానిక్ సంబంధించిన నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించడానికి భద్రాచలం పట్టణంలో నెలకొల్పిన భద్రగిరి మార్ట్ శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు సాయంత్రం యూనిట్ అధికారులతో కలిసి భద్రగిరి మార్ట్ ను ఆయన సందర్శించి గిరి మార్ట్ లో నిత్యవసర సరుకులను మరియు ఆర్గానిక్ సంబంధించిన వివిధ రకాల సామాన్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, సేంద్రీయ ఎరువులతో పండించిన ఉత్పత్తులు మరియు ఎస్ హె జి గ్రూప్ మహిళలు తయారుచేసిన నాణ్యత గల ఇతర పదార్థాలు సరసమైన ధరలకు ప్రజలకు అందించడానికి భద్రగిరి మార్ట్ ను ప్రారంభిస్తున్నామని, ఈ సువర్ణ అవకాశాన్ని గిరిజన గ్రామాలలోని ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో భద్రగిరి మార్ట్ ను సందర్శించి ఆరోగ్యకరమైన మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి గిరిజనులకు చేయూత అందించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, ఏపీ ఓ పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు, డి ఈ హరీష్, మేనేజర్ ఆదినారాయణ, జిసిసి మేనేజర్ జయరాజ్, మ్యూజియం ఇన్చార్జి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.




